పోలీసుల చర్యల్లో జోక్యం చేసుకోం! : మంత్రి ఎర్రబెల్లి

by Gopi |
పోలీసుల చర్యల్లో జోక్యం చేసుకోం! : మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్‌ టౌన్‌: పోలీసుల విధులు, చర్యల్లో అసలు పాలనాపరమైన విషయాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోమంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉటంకించారు. బుధవారం వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి ప్రసంగించారు. ఏనుమాముల మార్కెట్‌తో, అలాగే వరంగల్‌ పోలీస్‌ శాఖతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏనుమాముల మార్కెట్‌ ఎన్టీఆర్‌ కాలంలో మొదలైందని, ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని అన్నారు. నలభై ఏళ్ల రాజకీయంలో పోలీసులను పరిశీలిస్తున్నానని, ఒకప్పుడు సరైన వసతులు లేక పోలీస్‌స్టేషన్లు వెలవెలబోయేవని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను వరంగల్‌ జీపు డ్రైవర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోలీస్‌ స్టేషన్లకు అవసరానికి జీపులు పంపించేవాడినని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తుచేసుకున్నారు.


దీనిపై పోలీసులకు, జీపు యజమానులకు మధ్య ఒప్పందం ఉండేదని, పోలీసులకు జీపులు పెట్టినందుకు, జీపుల్లో ఏం తీసుకెళ్లినా, ఎంతమందిని తీసుకెళ్లినా పట్టుకోవద్దనే అంగీకారం ఉండేదని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్‌ నాయకత్వంలో ఇప్పుడా పరిస్థితులు లేవని అన్నారు. పోలీస్‌స్టేషన్‌కు అవసరమైన వాహనాలతోపాటు స్టేషన్‌ ఖర్చులకు కూడా రూ.30 వేల వరకు ఇస్తున్నారంటూ పక్కనే ఉన్న పోలీస్‌ అధికారులను అడిగి మరీ చెప్పారు. ఒకప్పుడు హోంగార్డులంటే తన కార్యకర్తలు, అభిమానులే వద్దనే వారు.. కేసీఆర్‌ సీఎం అయ్యాక హోంగార్డులకు, పోలీసులకు గౌరవం తీసుకొచ్చారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. న్యాయమైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని, అవే తమ ప్రభుత్వానికి ఆశీస్సులు అని తెలిపారు. రైతులు, వ్యాపారులు, అధికారులు అందరూ మంచివారేనని, కానీ.. వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక మీదట ఏనుమాముల పోలీసులదేనని మంత్రి సూచించారు. అంతకుముందు సీపీ ఏవీ రంగనాథ్‌ మాట్లాడుతూ నగరంలో భూదందాలపై ఉక్కుపాదం మోపుతామని మరోసారి హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు వెల్లడిరచారు. సంఘవిద్రోహక శక్తులను తప్పక శిక్షిస్తామని తెలిపారు. ప్రజలు నిర్భయంగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలియజేయాలని, అందరి సహకారంతోనే కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.


అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ ప్రజలకు న్యాయపరమైన సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్ధేశంతో ఏనుమాములలో నూతన పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటలక్ష్మీ, ఏసీపీ నరేష్, వరంగల్ తహశీల్దార్ సత్యపాల్ రెడ్డి, సీఐలు మల్లేశం, చేరాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాహుల్, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది, మార్కెట్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్కటి ముచ్చట్లు మరవని ఎర్రబెల్లి..!

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎక్కడికి వెళ్లినా, ఏ సమావేశం నిర్వహించినా... ఎన్కటి ముచ్చట్లు కచ్చితంగా గుర్తు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. గతంలో ఎన్నోమార్లు టీడీపీ, ఎన్టీఆర్‌, నారా చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన పనులకు, ఇప్పుడు జరుగుతున్న పనులకు పోల్చడం మంత్రికి సర్వసాధారణమైంది. బుధవారం కూడా ఏనుమాముల మార్కెట్‌ యార్డులో పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవంలో పోలీసు శాఖకు, తనకు ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన జీపు డ్రైవర్లు, ఓనర్లు అసోసియేషన్‌కు అధ్యక్షుడే కాదు, రేషన్‌ డీలర్‌గా కూడా పనిచేశారంటూ సమావేశానికి హాజరైన పలువురు చెవులు కొరుక్కున్నారు. అంతేకాదు, ఎర్రబెల్లి ఏం మీటింగులోనైనా టీడీపీ కాలం నాటి ముచ్చట లేకుండా మాట్లాడడం కష్టమైన పనేనని గుసగుసలు వినిపించాయి.

Next Story

Most Viewed